Cable Expo in Hyderabad : టెలివిజన్ ప్రసారాల రంగంలో కొత్త సాంకేతికత, కేబుళ్ల వంటి ఉత్పత్తులు వస్తున్నాయి. వీటిని పరిచయం చేసేందుకు కేబుల్ నెట్ కాన్సెప్ట్ సంస్థ ఏటా ఆగస్టులో ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లో కేబుల్ ఎక్స్పోను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. 12వ కేబుల్ ఎక్స్పోలో 200లకు పైగా స్టాళ్లు ఏర్పాటు కాగా దేశ, విదేశాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో సుమారు 30 వేల మంది పాల్గొంటారని నిర్వాహకుల అంచనా వేస్తున్నారు.
కరోనా సమయంలో కేబుల్ పరిశ్రమ చాలా సేవ చేసిందని, సభాపతి ప్రసాద్ కుమార్ కొనియాడారు. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల రాకతో ప్రసారాల్లో నాణ్యతతోపాటు వేగం పెరిగింది. కేబుల్ ఎక్స్పోలో వీటికి సంబంధించి నిపుణులతో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కేవలం టీవీ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ సర్వీస్, సీసీటీవీ రంగాల్లో వచ్చిన సాంకేతికతను ఆయా సంస్థలు ప్రదర్శిస్తున్నాయి. కేబుల్ ఆపరేటర్లు, కొత్త వినియోగదారుల నుంచి ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తోందని స్టాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
'రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ అవసరం ఉన్నా మీకు తోడుగా ఉంటా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎన్సీ ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ ఆపరేటర్లకు కొత్త సాంకేతికత పట్ల అవగాహన పెంచేందుకు దోహద పడుతున్న సంస్థ సీఎన్సీ ఎక్స్పో'- గడ్డం ప్రసాద్ కుమార్, సభాపతి
కొత్త సాంకేతికతపై సెమినార్లు : కేబుల్ ఆపరేటర్లకు ఎదురవుతున్న సమస్యలు, వారి వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలపై ఈ ప్రదర్శనలో సెమినార్లు నిర్వహిస్తున్నారు. కొత్త పరికరాలు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎలా వాడాలో ప్రాక్టికల్గా వివరిస్తున్నారు. ఈ ప్రదర్శనతో కొత్త సాంకేతికతపై అవగాహన వస్తుందని సందర్శకులు చెబుతున్నారు. కేబుల్ ఎక్స్పో మరో 2 రోజుల పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కేబుల్, ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ పరిశ్రమ నిపుణులందరినీ ఈ ప్రదర్శన ఒక చోటికి చేర్చింది. అంతిమంగా వినియోగదారులకు సైతం నాణ్యమైన సేవలు అందే అవకాశం ఉంది.
'కేబుల్ టీవీ, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫ్లాంలలోని కొత్త సాంకేతికతకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కేబుర్ ఆపరేటర్లు, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫ్లాంకు సంబంధించిన అందరూ ఇక్కడికి వచ్చి కేబుల్ ఎక్స్పో తిలకించాలని విజ్ఞప్తి చేస్తున్నా'-రాము, సీఎన్సీ అధినేత