Tenali Woman Brain Dead Mystery in Guntur District : యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిన రౌడీషీటర్, గంటల వ్యవధిలోనే అపస్మారక స్థితిలో ఆమెను వైద్యశాలలో చేర్చిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యారు. సత్వరం స్పందించిన తెనాలి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్కు చెందిన మదిర సహానా (25) స్థానికంగా ఉన్న ఒక స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ కేంద్రంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. రోజూ మాదిరిగానే శనివారం సాయంత్రం (అక్టోబర్ 19న) ఆమె ఇంటి వద్ద నుంచి తాను పనిచేసే చోటికి బయల్దేరింది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో నవీన్ అనే యువకుడు సహానా ఫోన్ నుంచి ఆమె తల్లికి ఫోన్ చేశాడు. మీ అమ్మాయి సహానా కళ్లు తిరిగి పడిపోతే ప్రైవేటు వైద్యశాలలో చేర్చానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ హస్పిటల్కు వెళ్లారు. వారు వచ్చిన కొద్ది సేపటికే నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
గంటల వ్యవధిలోనే పట్టుబడ్డ నిందితుడు - బెడిసికొట్టిన వ్యూహాలు
నవీన్పై రౌడీషీట్ : కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ 2016లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. దీంతో అతనిపై రౌడీషీట్ నమోదు అయ్యింది. అతడు స్థానికంగా కోడి మాంస విక్రయ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సహానా నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నవీన్ బంధువులు ఉండంతో అప్పుడప్పుడు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వాళ్లిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. శనివారం (అక్టోబర్ 19న) తన పుట్టిన రోజు వేడుక ఉందని ఆమెను నవీన్ పిలించాడు. ఈ క్రమంలోనే స్థానిక ప్రకాశంబజార్ నుంచి ఆమెను కారులో ఎక్కించుకుని బయల్దేరాడు. మార్గ మధ్యలో తాను ఆకస్మికంగా బ్రేక్ వేయటంతో సహానా తల డ్యాష్ బోర్డుకు కొట్టుకుంది. ఈ సంఘటనతో ఆమె అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను తాను వైద్యశాలలో చేర్చినట్లు పోలీసులకు వివరించాడు.
ఆగిన కన్న తల్లి గుండె- తల్లడిల్లిన కనుపాపలు
వైద్యశాలల చుట్టూ తిరిగిన కుటుంబ సభ్యులు : సహానా మెదడులో రక్తం గడ్డ కట్టిందని తెనాలిలోని ప్రైవేటు వైద్యశాల సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమెకు మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఎయిమ్స్ తీసుకెళ్లాగా అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్డెడ్ అయ్యిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సహానాను మరో రెండు వైద్యశాలకు తీసుకెళ్లిన అనంతరం మళ్లీ తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ న్యూరో సర్జన్ లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
ఆ రెండు గంటలు ఏం జరిగింది? : సహానా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నవీన్ సహానాను కారు ఎక్కించుకుని వెళ్లి తిరిగి వైద్యశాలకు చేర్చే మధ్య ఉన్న రెండు గంటల వ్యవధిలో ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నవీన్ చెబుతున్నట్లు ఆకస్మిక బ్రేక్ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా అతను ఆమెపై దాడి చేశాడా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆదివారం ఉదయం (అక్టోబర్ 20న) ఘటన జరిగిన సమాచారం పోలీసులకు అందగానే వారు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అతను వినియోగించిన కారునూ స్వాధీనం చేసుకున్నారు.
మా అమ్మాయి శరీరంపై గాయాలు ఉన్నాయి : తన బిడ్డ శరీరంపై అనేక చోట్ల గాయాలు ఉన్నాయని, నవీన్తో పాటు మరి కొందరు కూడా కారులో ఉన్నట్లు సహానా తల్లి అరుణకుమారి అనుమానం వ్యక్తం చేసింది. తమ బిడ్డకు ఈ పరిస్థితి కల్పించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. సహానా కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు.