Roads development in Tenali: గుంటూరు జిల్లాలో కీలక రోడ్లు, ప్రజలు నిత్యం రాకపోకలు అధికంగా సాగించే మార్గాలైన తెనాలి - గుంటూరు వయా నారా కోడూరు, తెనాలి - విజయవాడ వయా మంగళగిరి రహదారుల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. తెనాలి నుంచి గుంటూరు మార్గంలో నారా కోడూరు వరకు, తెనాలి - విజయవాడ మార్గంలో మంగళగిరి హైవే వరకు 4 లేన్గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసుకుంది. ఇందుకు పీపీపీ (Public Private Partnership) విధానాన్ని అనుసరించనున్నారు. డీపీఆర్ (Detailed project report) తయారీకి ఇటీవల రోడ్లు, భవనాల శాఖ టెండర్లు పిలిచింది.
![Roads development in Tenali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-12-2024/23097579_tenali_roads.jpg)
క్షేత్ర స్థాయిలో పరిశీలన: DPR రూపొందించడానికి సంబంధిత ప్రతినిధులు ఆయా మార్గాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. రహదారి విస్తరణకు అవసరమైన భూమి ఉందా, లేదా?, ఆక్రమణల తొలగింపు, భూ సేకరణ చేయాల్సి వస్తే ఇరువైపులా ఎంత మేరకు తీసుకోవాలి, ఎక్కడ కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మించాలి వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. అనంతరం మొత్తం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసి, టోల్ గేట్ల ద్వారా నిర్మాణ వ్యయాన్ని ఎంత కాలంలో తిరిగి పొందవచ్చు, ప్రభుత్వం అందించాల్సిన సహకారం తదితర అంశాలను విశ్లేషించనున్నారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది.
మొదలైన ప్రక్రియ: తెనాలి - మంగళగిరి, తెనాలి - నారాకోడూరు రోడ్లను నాలుగు వరుసలుగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైందని రోడ్లు, భవనాల శాఖ డీఈ రాజేంద్రనాయుడు తెలిపారు. డీపీఆర్ల తయారీకి రంగం సిద్ధం అవుతోందని, డీపీఆర్లు అందుబాటులోకి వచ్చాక తదుపరి కార్యాచరణ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రెండు నుంచి మూడు సంవత్సరాలలో రోడ్లు సిద్ధం కావాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.