Minister Rajanarsimha Reaction On KTR Comments : వైద్యారోగ్యశాఖపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ స్పందించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు లేక మృతి చెందారంటూ పెట్టిన కేటీఆర్ ట్వీట్ను ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లోనే బదులిచ్చారు.
వసీమ్ కుటుంబానికి అండగా ఉంటాం : వసీమ్ వ్యక్తిగత కారణాలతో చనిపోయారని, సదరు వ్యక్తి ఆత్మహత్యను రాజకీయాలకు వాడుకోవటం దురదృష్టకరమని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. వసీమ్కి ఒక్కనెల వేతనం మాత్రమే పెండింగ్ ఉందని, ఆ మొత్తానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేటీఆర్ కావాలనే కాంగ్రెస్పైన విమర్శలు చేస్తున్నారని, వసీమ్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు చేసిన పోస్ట్ పై స్పందించారు.
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) August 18, 2024
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగి వసీమ్ తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ను రాజకీయాలకు…
ప్రతి రెండు గ్రామాలకు సబ్సెంటర్ : రాష్ట్రంలో ప్రతి పది కిలోమీటర్లకు పీహెచ్సీ, ప్రతి రెండు గ్రామాలకు సబ్సెంటర్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం పనిచేస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ సరస్వతి మందిరం ఆవరణలో కాశీనాథ్ బాబా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. తొంభై శాతం వైద్యసేవలు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ పనిచేస్తోందని ఆయన తెలిపారు.
పారామెడికల్ కళాశాల ఏర్పాటు : సబ్సెంటర్లలో ఇప్పటికే ఏడు రకాల అదనపు సేవలను ప్రారంభించామని, రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. ఆధ్యాత్మిక ప్రచారంలో ముందుకు సాగే కాశీనాథ్ బాబా, ప్రజారోగ్యం కోసం గ్రామీణ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. జహీరాబాద్, నారాయణఖేడ్ సరిహద్దులోని రాఘవపూర్ సరస్వతి మందిరం పరిసరాల్లో పారామెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.