Minister Ponnam Prabhakar at Government School : రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ అన్నిరకాల విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం పిల్లలు ఉత్సాహంగా బడి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు. హైదరాబాద్ అబిడ్స్ అలియాలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26 వేల ప్రభుత్వ పాఠశాలలకు 11 వందల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గత పదేళ్లల్లో విద్య నిర్వీర్యం అయిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి : అలియాలోని ప్రభుత్వ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని మంత్రి పొన్నం కొనియాడారు. విద్యార్థులు ఆసక్తిగా చదవడంతోపాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, డీఈవో రోహిణి, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రామన్నపేట దానవాయిగూడెం పాఠశాల విద్యార్థులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాఠ్యపుస్తకాలతోపాటు దుస్తులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. పాఠశాలలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా బోధిస్తున్నారని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీఈవో ప్రణీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. బాగా చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు.
'గత ప్రభుత్వం పదేళ్లల్లో విద్యను నిర్వీర్యం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పాఠశాలల్లో డ్రాపవుట్లు లేకుండా అధికారులు చూడాలి. పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించి తగిన సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.1100 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నాం' - పొన్నం ప్రభాకర్, మంత్రి