Man killed 20 Stray Dogs for killing Pet Dog in Telangana: ఆ వ్యక్తికి శునకాలంటే ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాడు. తాజాగా వాటిపై వీధి కుక్కలు (Street Dogs in Telangana)దాడి చేసి ఒకదాన్ని చంపేయగా, మరొక దానిని గాయపరిచాయి. ఈ విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా వాటిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం రూపొందించాడు. ఇందులో భాగంగా స్నేహితులతో కలిసి తుపాకీతో ఏకంగా 20 వీధి కుక్కలను చంపేశాడు. ఈ అమానవీయ ఘటన తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో నెల రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పిచ్చికుక్క దాడిలో 20మందికి గాయాలు- ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
Man Killed 20 Stray Dogs for Killing Pet Dog : అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు శునకాన్ని వీధి కుక్కలు కరిచి చంపాయని ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి తుపాకీతో కాల్చి ఏకంగా 20 వీధి శునకాలను చంపాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ వివరాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహారెడ్డి(57) హైదరాబాద్ రెడ్హిల్స్లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఫలక్నుమాకు చెందిన తారీఖ్ అహ్మద్(42), మహ్మద్ తాహెర్(40) స్నేహితులు. నర్సింహారెడ్డి అత్తగారిది అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. అత్తగారింట్లో డాక్స్హుండ్ జాతి రకం పెంపుడు శునకాలున్నాయి.
బాలికను వెంటాడిన వీధికుక్కలు - స్థానికుల చొరవతో సేఫ్ 'వీడియో వైరల్'
ఒకదాన్ని ఆ గ్రామంలోని వీధి శునకాలు కరిచి చంపడంతోపాటు మరోదాన్ని గాయపరిచాయి. వాటిపై కోపం పెంచుకున్న నర్సింహారెడ్డి ఫిబ్రవరి 15న తన కారులో మిత్రులతో కలిసి పొన్నకల్ గ్రామానికి వచ్చాడు. అదే రోజు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తారిఖ్ అహ్మద్ వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాలుస్తూ వెళ్లారు. దీంతో 20 మూగజీవాలు మృతిచెందాయి. పంచాయతీ కార్యదర్శి విజయ రామరాజు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బెంజ్కారులో వచ్చారని నిర్ధారించారు.
ఈ క్రమంలోనే పొన్నకల్లో పార్టీ చేసుకునేందుకు ముగ్గురు అదే కారులో మంగళవారం వచ్చారని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. దీనిపై విశ్వసనీయ సమాచారంతో భూత్పూరు సీఐ ఎస్.రామకృష్ణ, అడ్డాకుల ఎస్సై ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో బృందం వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిందితుల నుంచి 0.22 రైఫిల్, 6 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.