DSC Exams Will Start From Today in Telangana : ఎట్టకేలకు అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి పదకొండున్నర వరకు ఒక సెషన్ పరీక్ష కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి నాలుగున్నర వరకు మరో సెషన్ పరీక్ష ఉంటుంది.
ఉదయం ఏడున్నర నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి : అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి మాత్రం మరో అరగంట అదనంగా పరీక్ష జరగనుంది. ఉదయం ఏడున్నర నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోని అనుమతించారు. పరీక్షకు పది నిమిషాల ముందే అభ్యర్థులు సెంటర్లలోకి వెళ్లారు. పరీక్షా కేంద్రాలలోనికి క్యాలిక్లేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యక్తిగత వస్తువులను అనుమతించేది లేదు. అభ్యర్థుల హాల్ టిక్కెట్ తోపాటు వ్యక్తిగత ఐడీ కార్డును పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించారు.
11,056 పోస్టులతో : ఏడాది క్రితం సెప్టెంబర్లో గత ప్రభుత్వం సుమారు ఐదువేలకుపైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే వివిధ కారణాలతో పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఫైనాన్స్ విభాగం ఆమోదించిన 5,976 పోస్టులకు పాత వాటిని జతచేసి మొత్తం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ , 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటరిగిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
డీఎస్సీ రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2లక్షల 79వేల 956 మంది దరఖాస్తు చేసుకోగా నిన్న సాయంత్రం వరకు సుమారు రెండు లక్షలన్నర మంది హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు రాయాల్సి ఉన్న వారు ఒకే కేంద్రంలో పరీక్ష రాసే విధంగా వెసులుబాటు కల్పించినట్లు విద్యాశాఖ తెలిపింది.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు : పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకేచోట ఉండరాదని సూచించింది. అలాగే పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ , ఇంటర్నెట్ దుకాణాలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి ఆగస్టు 5వరకు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.