CRDA Range Reduced in During YSRCP Govt: ముందుచూపు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి రాజధానిగా గుంటూరు- విజయవాడ నగరాల మధ్య ప్రాంతాన్ని నాడు చంద్రబాబు ఎంపిక చేశారు. 2014 డిసెంబరులో సీఆర్డీఏను ఏర్పాటు చేసి దీని పరిధిని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 8 వేల 603.32 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిపై కక్ష పెంచుకున్నారు.
3 రాజధానులు అంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ- సీఆర్డీఏను సర్వ నాశనం చేశారు. దశలవారీగా సీఆర్డీఏ పరిధిని జగన్ కసితీరా కుదించేశారు. పలు ప్రాంతాలను విడదీసి, ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. ఐదేళ్లలో 1,610 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతానికి కోత వేయడంతో సీఆర్డీఏ పరిధి 6 వేల 993.24 చదరపు కిలో మీటర్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం 45 మండలాలు, 12 పట్టణాలకు పరిమితమైంది. రాజధాని ప్రాంతం నుంచి విడదీసిన గ్రామాలకు తీరని అన్యాయం జరిగింది.
సీఆర్డీఏను నోటిఫై చేసినప్పుడు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలను కలిపి రాజధాని నగరంగా గుర్తించింది. మూడేళ్ల క్రితం ఇందులోని ఉండవల్లి, నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నిడమర్రు, పెనుమాక గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్లో జగన్ ప్రభుత్వం విలీనం చేసింది. దీనిని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. 29 గ్రామాలను ఒక్కటిగానే ఉంచాలని ప్రభుత్వానికి విన్నవించినా జగన్ బేఖాతరు చేస్తూ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు.
గతంలో సీఆర్డీఏ పరిధిలో ఉన్న సత్తెనపల్లి, దాని చుట్టుపక్కల ఉన్న మండలాలను ఏడాదిన్నర క్రితం మళ్లీ నాటి ప్రభుత్వం విడదీసింది. పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- పడా పేరుతో కొత్తగా ఏర్పాటు చేసి, వెయ్యి 47.67 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇందులో విలీనం చేసింది. సత్తెనపల్లి పట్టణం, గ్రామీణ మండలం, యడ్లపాడు, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి మండలాలను పూర్తిగా పడా పరిధిలోకి మార్చారు.
దీని వల్ల ఈ ప్రాంతాల్లో అభివృద్ధి స్తంభించింది. గతంలో సీఆర్డీఏ నిధులు 12 కోట్ల రూపాయలతో సత్తెనపల్లిలో పాత రక్షిత చెరువును తారకరామసాగర్గా, పక్కనే ఉన్న వావిలాల సమాధి ప్రాంతాన్ని స్క్మృతివనం, పార్కులుగా అభివృద్ధి చేశారు. పర్యాటకంగా సత్తెనపల్లిలోని పాత చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ నిధులు అక్కరకొచ్చాయి. ఆ స్థాయిలో నిధుల సమీకరణ పడాతో సాధ్యపడదు.
వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను 562.41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సీఆర్డీఏ నుంచి విడగొట్టి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- బుడాలో విలీనం చేశారు. చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలను బుడాలో కలిపారు. సీఆర్డీఏ పరిధిలో ఉంటే రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగం కావొచ్చు. కీలక ప్రాజెక్టులు ఈ ప్రాంతాలకు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. భూములు, స్థలాల ధరలు పెరగడం వల్ల స్థానికులకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.
నెల రోజుల్లోగా రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించాలి - సీఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు