Telangana Talli Statue Bhoomi Pooja At Secretariat : రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున (డిసెంబర్ 9) తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారన్న ఆయన 2014లో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు గత పాలకులకు మనసు రాలేదని బీఆర్ఎస్ నేతలను విమర్శించారు. విగ్రహ ఏర్పాటును తెరమరుగు చేశారని మండిపడ్డారు. తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో నిర్మించామని, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డామని చెప్పారు కానీ తెలంగాణ తల్లిని మరిచారని పేర్కొన్నారు. ప్రగతి భవన్లో గడి నిర్మించుకుని పోలీసు పహారా పెట్టారని ధ్వజమెత్తారు.
"రాజీవ్గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా భావించాం. రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని మేధావులు సూచించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై జూన్ 2న ప్రకటించాను. తెలంగాణ ఏర్పాటుకు డిసెంబర్ 9 పునాదిరాయిగా మారింది. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 పండుగ రోజు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాం." - రేవంత్ రెడ్డి, సీఎం
గత ప్రభుత్వం నినాదాలను కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకం : గత ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రగతి భవన్ను ప్రజా భవన్గా మార్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నేతల ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని వెల్లడించారు.
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు: సీఎం రేవంత్రెడ్డి - Telangana Talli Celebrations 2024