Jitta Balakrishna Reddy Passes Away : హైదరబాద్ యశోద ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి తుదిశ్వాస విడిచారు. యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లికి చెందిన ఆయనకు భార్య, కూమార్తె, కుమారుడు ఉన్నారు. యశోద ఆసుపత్రి నుంచి భౌతికకాయాన్ని భువనగిరి శివారులోని ఆయన ఫామ్హౌస్కు తరలించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి పార్ధీవదేహానికి ప్రముఖులు, రాజకీయ నేతలు పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
సీఎం రేవంత్ దిగ్బ్రాంతి : ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాలకృష్ణారెడ్డి తనకు మిత్రుడని, సన్నిహితుడని పేర్కొన్న రేవంత్ రెడ్డి, యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అని అభిప్రాయపడ్డారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. జిట్టా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అకాల మరణం చెందిన జిట్టా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ సంతాపం : బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతిపట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి జిట్టా భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్రెడ్డి, గొంగిడి సునీత మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాలకృష్ణారెడ్డి ఉద్యమంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర : తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి కీలకంగా వ్యవహరించారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు దఫాలుగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అయినా ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడారు. జిల్లాలో ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. దిల్లీ, హైదరాబాద్, భువనగిరిలో తెలంగాణ సంస్కృతినీ, జాతరలను, ఉత్సవాలను నిర్వహించిన జిట్టా, గతంలో మూసీ ప్రక్షాలన కోసం పాదయాత్ర, బునాది గాని కాల్వ కోసం ఆమరణ నిరహార దీక్ష చేశారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో స్వంత ఖర్చులతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం రూ.3,448 కోట్ల ఆర్థిక సాయం - central govt announce flood relief