Akkineni Nagarjuna Defamation Suit Updates : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల స్టేట్మెంట్లను సైతం నమోదు చేస్తోంది.
మంత్రి వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది : ఈ క్రమంలో పిటిషన్ ఎందుకు దాఖలు చేసారని నాగార్జునను ధర్మాసనం ప్రశ్నించగా, మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మంత్రి చేసిన కామెంట్స్ వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులు పైనా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని తన వాంగ్మూలంలో వివరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అసత్య ఆరోపణలన్న ఆయన, రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని పేర్కొన్నారు.