TDP Complaints on YSRCP Candidates Nominations: రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. అయితే కృష్ణాజిల్లా గుడివాడతో పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లతో నామినేషన్లు దాఖలు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారుల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TDP Complaint on Buggana Nomination: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి బుగ్గన అఫిడవిట్పై టీడీపీ అభ్యంతరం తెలిపింది. అఫిడవిట్లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బుగ్గన నామినేషన్ను డోన్ ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని ఆర్వో బుగ్గన న్యాయవాదిని కోరారు.
Complaint on Shilpa Ravichandra Kishore Reddy Nomination: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి అఫిడవిట్పై స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. రూ.కోట్ల విలువైన ఆస్తులను నామినేషన్లో చూపలేదని, ఈ నేపథ్యంలో రవిచంద్ర నామినేషన్ను రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
Complaint on YSRCP Candidate Adipraj Nomination: మరోవైపు అనకాపల్లి జిల్లా పెందుర్తి వైఎస్సార్సీపీ అభ్యర్థి అదీప్రాజ్ అఫిడవిట్పై జనసేన అభ్యర్థి పంచకర్ల ఫిర్యాదు చేశారు. అఫిడవిట్లో కేసులను ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ను పెండింగ్లో పెట్టారు. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని అదీప్రాజ్కు ఆర్వో సమయం ఇచ్చారు.
TDP Leader Tulasi Complaint on Kodali Nani Nomination: కృష్ణాజిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్పై వివాదం నెలకొంది. నామినేషన్లో కొడాలి నాని తప్పుడు సమాచారం పొందుపరిచారని రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం నేత తులసి ఫిర్యాదు చేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించిన కొడాలి నాని, అఫిడవిట్లో తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని పొందుపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొడాలి నానికి మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను తులసి జత చేశారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందున కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఫిర్యాదులో టీడీపీ నేత తులసి కోరారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TDP Complaint on Mithun Reddy Nomination: రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్రెడ్డి నామినేషన్పైనా రిటర్నింగ్ అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ వసతి గృహానికి సంబంధిత అధికారుల నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ తేలేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ను తిరస్కరించాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Complaint on Annabathuni Sivakumar Nomination: తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ను రిజెక్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఫార్మ్ 26 అఫిడవిట్లో నోటరీ సంతకం, అభ్యర్థి సంతకం వేర్వేరు తేదీలతో ఉన్నాయని, దీంతో అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ తిరస్కరించాలని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
TDP Complaint on Alajangi Ravikumar Nomination: పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అలజంగి రవికుమార్ నామినేషన్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వసతి గృహానికి నో డ్యూస్ సర్టిఫికెట్ దాఖలు చేయని కారణంగా ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Complaint on Piriya Vijaya Nomination: ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియ విజయ ఫార్మ్ 26లో ప్రభుత్వ వసతి గృహానికి నో డ్యూస్ సర్టిఫికెట్ దాఖలు చేయలేదని, ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరించాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.
చివరిరోజు నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్ల పర్వం - కూటమి అభ్యర్థులపై కుతంత్రాలు - Nomination end