KTR Question Allu Arjun Arrest : సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేంటని కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. సీఎం పేరు మరచిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా అని కేటీఆర్ అన్నారు. సీఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సహా పలువురు నేతలు సమావేశమయ్యారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం సమయం ఇస్తే అన్ని సమస్యలపై చర్చించవచ్చు అని మీరు ఆరోపించిన స్కాములు, ఫార్ములాలు అన్నింటిని చర్చిద్దామన్నారు. సర్కార్కు బిల్లుల ఆమోదంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు.
"అసెంబ్లీ సమావేశాలు 15 -20 రోజులు పెట్టండి, ముందుగా లగచర్ల గురించి, గురుకులాలపై, చేనేత సమస్యలు, ఆటో డ్రైవర్ల మరణాలు, వరికి బోనస్పై కూడా మాట్లాడదాం, మిగతా 4,5 రోజుల్లో మీరు చెబుతున్న స్కాములు, ఈ-ఫార్ములాలపై మాట్లాడదాం. ఆ సినిమా యాక్టర్ తెలంగాణ సీఎం అని పేరు మర్చిపోయాడు, పేరు మర్చిపోతే జైల్లో పెడతారా, ఇదెక్కడి అన్యాయం." - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
లగచర్ల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తాం : ఎక్కడైనా ప్రభుత్వంపై మూడు, నాలుగేళ్లకు వ్యతిరేకత వస్తుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. అన్నీ అనుకూలిస్తే పట్నం నరేందర్ రెడ్డి కేసులో రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. నరేందర్ రెడ్డికి, రైతులకు న్యాయం జరిగేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. లగచర్ల అంశాన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని తెలిపారు.
కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర : కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తరహాలో అందరమూ కదులుదామని కేటీఆర్ నేతలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కొడంగల్ వచ్చి అక్కడి రైతుల బాధలు తెలుసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోదని వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు అంటున్నారు... కాంగ్రెస్ను పంపేందుకు 2028 వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా రాదేమోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?