CM Revanth Reddy in Kosgi Public Meeting : పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కోస్గి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ‘ఇంకా యుద్ధం ముగియలేదని, ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చిందని అన్నారు. పార్లమెంట్లో(Parliament) పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్న సీఎం, 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్ గెలిచినట్లని వ్యాఖ్యానించారు.
Congress Guarantees Implementation : వారం రోజుల్లో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లో మొదటిసారి ఆయన పర్యటించారు. రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించిన ప్రతీ హామీని వీలైనంత త్వరలో అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి, మార్చి 15న రైతు బంధు, రైతు భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పాలమూరు గడ్డ తనను ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని, కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను సీఎం అయ్యానని కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్రెడ్డి
"రూ.500 ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పాం, ఆ దిశగానే రాబోయే వారం రోజుల్లో ఆ హామీని నిలబెట్టుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం."-రేవంత్ రెడ్డి, సీఎం
CM Revanth Reddy Fires on KCR : సభలో మాట్లాడిన రేవంత్రెడ్డి, కేసీఆర్పై(KCR) తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాయలసీమను రతనాల సీమ చేసేందుకు కృష్ణా జలాల తరలింపునకు కేసీఆర్ సహకరించారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ(Telangana Movement) సమయంలో మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలిచారని రేవంత్ గుర్తిచేశారు. కరీంనగర్ నుంచి గెలవరనే ఆనాడు మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారని తెలిపారు. వలస వచ్చిన కేసీఆర్ను గెలిపిస్తే, తెలంగాణ వచ్చాక పాలమూరుకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని విమర్శించారు.
Revanth Reddy Comments on BJP : 2014లో నరేంద్రమోదీ(PM Modi) జిల్లాకు వచ్చి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నేటికీ పదేళ్లు గడిచినా ఎవరూ పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలవాలని, మహబూబ్నగర్ నుంచి వంశీచందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
'ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం - గత పాలకుల మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం'
రాష్ట్రంలో రీజినల్ రింగ్రోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా - గడ్కరీతో ఫలించిన సీఎం చర్చలు