Prawns Pulao Recipe in Telugu : ఎప్పుడూ చికెన్, మటన్తో చేసిన రెసిపీలను తినాలంటే బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే, ఈ సండే కాస్త వెరైటీగా ఈ రెసిపీని ట్రై చేయండి. అదే, ఘుమఘుమలాడే "రొయ్యల పులావ్". నీచు వాసన లేకుండా చికెన్, మటన్ పులావ్లను మించిన టేస్ట్తో నోరూరిస్తోంది. రొయ్యలు తినని వారూ ఈ పులావ్ని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు! మరి, ఈ సూపర్ టేస్టీ ప్రాన్స్ పులావ్కు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- శుభ్రం చేసిన రొయ్యలు - అరకిలో
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 2 చెంచాలు
- ధనియాల పొడి - 2 చెంచాలు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు
- నిమ్మరసం - 2 చెంచాలు
- పసుపు - అరచెంచా
- గరం మసాలా - అరచెంచా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా ఆకులు - కొన్ని
గోంగూర రొయ్యల కర్రీ - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్ సూపర్ హిట్!
పులావ్ రైస్ కోసం :
- బాస్మతి బియ్యం - 2 కప్పులు
- ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
- యాలకులు - 4
- దాల్చినచెక్క - రెండంగుళాల ముక్క
- లవంగాలు - 5
- బిర్యానీ ఆకులు - 2
- స్టార్ మొగ్గలు - 2
- ఉల్లిపాయ తరుగు - కప్పు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు
- కొత్తిమీర తరుగు - 2 చెంచాలు
- పుదీనా ఆకులు - 2 టేబుల్స్పూన్లు
- ధనియాల పొడి - ఒకటిన్నర చెంచా
- గరం మసాలా - పావు చెంచా
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 2 రెబ్బలు
- నెయ్యి - చెంచా
సండే స్పెషల్ - టేస్టీ "రాజుగారి కోడి పులావ్" - ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా రంధ్రాల గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే, బాస్మతి రైస్ను కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చక్కగా వేయించుకోవాలి.
- అవి వేగాక అందులో కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు యాడ్ చేసుకొని, మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై పళ్లెంలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, స్టార్ మొగ్గలను వేసి వేయించుకోవాలి.
- అవి వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి.
- ఆ విధంగా వేయించుకున్నాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, పుదీనా ఆకులు యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, మూడున్నర కప్పుల నీళ్లు వేసుకొని కలిపి ఎసరుని బాగా మరిగించుకోవాలి.
- నీళ్లు తెర్లకాగుతున్నప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వడకట్టి వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించిన రొయ్యల మిశ్రమం, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి అన్నీ కలిసేలా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి.
- అనంతరం మూతపెట్టి లో ఫ్లేమ్ మీద వాటర్ పూర్తిగా గుంజుకొని పులావ్ చక్కగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇక దింపిన తర్వాత చివర్లో నెయ్యి యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘమలాడే "రొయ్యల పులావ్" రెడీ!
పులావ్, బిర్యానీలోకి సూపర్ సైడ్ డిష్ "మఖానా రైతా" - అద్దిరిపోయే రుచితో చేసుకోండిలా!