Tech Mahindra Q2 Profit : ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా శనివారం విడుదల చేసిన రెండో త్రైమాసిక ఫలితాలను లాభాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 153.1శాతం పెరిగి రూ.1,250 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.493.9 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం పెరిగిందని టెక్ మహీంద్రా తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.13,313.2 కోట్లుగా నమోదైనట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.12,863.9 కోట్లతో పోలిస్తే 3.49 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా షేర్లపై మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.15 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. దీని రికార్డు తేదీని ఇంకా ప్రకటించలేదు.
రానున్న త్రైమాసికంలోనూ మెరుగైన వృద్ధి నమోదు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ మోహిత్ జోషి ధీమా వ్యక్తం చేశారు. సమీక్షా త్రైమాసికంలో టెక్ మహీంద్రా పుణె ప్రధాన కార్యాలయంలో కొత్తగా 6,653 ఉద్యోగులను నియమించింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,273కు చేరింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ బీఎస్ఈలో 0.68 శాతం కుంగి రూ.1,688 వద్ద స్థిరపడింది.