HC verdict On Siddaramaiah MUDA Scam : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-MUDA స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఉందని తెలిపింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది.
ముఖ్యమంత్రిపై విచారణకు హైకోర్ట్ అనుమతి
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష భాజపా, జేడీఎస్ ఆరోపించాయి. ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన గవర్నర్, తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి మంజూరుచేశారు.
గవర్నర్ ఆదేశాలపై సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ వేయగా, విచారణ జరిపే వరకూ ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తిచేసిన కర్ణాటక హైకోర్టు గవర్నర్ చర్యను సమర్థించింది. సీఎంపై విచారణకు అనుమతించింది.