Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపుర్ జిల్లా ఉసూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్-మారేడుబాక అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య గురువారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు.
దక్షిణ బస్తర్ అడవుల్లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో బీజాపుర్, సుక్మా, దంతెవాడ జిల్లాల నుంచి డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), కోబ్రా 204, 205, 206, 208, 210, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన సుమారు 1,500 మంది వరకు జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఎదురుకాల్పులు జరగ్గా మావోయిస్టులు మృతిచెందారు.
ఘటనా ప్రాంతం నుంచి ఒక ఎస్ఎల్ఆర్తోపాటు పెద్దఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. పూర్తి వివరాలను ఆపరేషన్ తర్వాత వెల్లడిస్తామన్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న బీజాపుర్ జిల్లాలో ఐఈడీ (ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్) పేల్చిన మావోయిస్టులు ఓ డ్రైవర్, ఎనిమిది మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు జరిగిన ప్రత్యేక ఎన్కౌంటర్లలో 26 మంది నక్సలైట్లు హతమయ్యారు.
ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
- బీజాపుర్ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పుత్కేల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిద్దరిని కూడా మెరుగైన చికిత్సల కోసం రాయపుర్ ఆస్పత్రికి తరలించారు.
- కొండగావ్ జిల్లాలో కీలక మావోయిస్టు గిజ్రురమ్ ఉసెండి జిల్లా ఎస్పీ అక్షయ్కుమార్ ఎదుట గురువారం లొంగిపోయాడు. ఇతను ఉత్తర బస్తర్ డివిజన్ టెక్నికల్ ఏరియా కమిటీ కమాండర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. లొంగిపోయిన అతడిపై రూ. 5 లక్షల రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు.