School Van Fell Into River : ఛత్తీస్గఢ్లోని స్కతీ జిల్లాలో 18 మందితో వెళ్తున్న స్కూల్ విద్యార్థుల వ్యాన్ ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. గ్రామస్థులంతా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే?
స్కతీ జిల్లా హస్సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసౌద్ గ్రామంలో కొన్నాళ్ల క్రితం సోన్ నదిపై ప్రభుత్వం వంతెనను నిర్మించింది. నదికి అవతలి వైపు ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వివిధ వాహనాల్లో రోజూ వంతెనపై నుంచే చేరుకుంటారు. ఆ విధంగానే ఓ స్కూల్కు చెందిన 18 విద్యార్థులు వ్యాన్లో బుధవారం ఉదయం బయలుదేరారు. వంతెనపై చేరుకోగానే అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది వాహనం.
అది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అనేక మంది ప్రజలను అక్కడికి రప్పించారు. అంతా కలిపి వ్యాన్లోని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులంతా హస్సాద్లోని హ్యాపీ పబ్లిక్ స్కూల్కు చెందిన వారని స్థానికులు తెలిపారు. చిన్నారులంతా క్షేమంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసుల అదుపులో వ్యాన్ డ్రైవర్
వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ అంజలి గుప్తా తెలిపారు. "వ్యాన్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఘటన జరిగింది. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్టీరింగ్ ఫెయిల్ కావడం వల్ల వ్యాన్ నదిలోకి వెళ్లిందని చెప్పాడు. అతడితోపాటు స్థానికులు అప్రమత్తమై పిల్లలందరినీ కాపాడారు. చిన్నారులంతా సురక్షితంగా ఉన్నారు. స్కూల్ యాజమన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం" అని చెప్పారు.
మరోవైపు, పాఠశాలలకు విద్యార్థులను రోజూ తీసుకెళ్లే వాహనాల పరిస్థితి అధ్వానంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. దీని పర్యవసానాలను చిన్న పిల్లలు, వారి కుటుంబసభ్యులు భరిస్తున్నారని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.