SC On Disabled Child Care Leaves : దివ్యాంగ చిన్నారి తల్లికి శిశు సంరక్షణ సెలవులను నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యానికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న రాజ్యాంగ విధి ధిక్కరణేనని సోమవారం సుప్రీంకోర్టు వెల్లడించింది. దివ్యాంగులైన చిన్నారులు గల ఉద్యోగినులకు శిశుసంరక్షణ సెలవులు కల్పించే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది.
'శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రత్యేక హక్కు కాదు. అది రాజ్యాంగపరమైన విధి. ఆదర్శ యజమానిగా రాజ్యం దానిని విస్మరించరాదు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కేంద్రాన్ని భాగస్వామిని చేయాలని, తీర్పు ఇవ్వడంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర కమిటీ నివేదికను జూలైలోపు సిద్ధం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పిటిషన్దారైన మహిళలకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు విషయాన్ని పరిశీలించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్టు తర్వాత చేపడతామని వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరణ
హిమాచల్ ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో జియోగ్రఫీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న షాలిని ధర్మాణికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అరుదైన జన్యుపరమైన వ్యాధి ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టాతో బాధపడుతున్నాడు. దీంతో ఆ బాలుడికి పుట్టినప్పటి నుంచి పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించిన కారణంగా నిబంధనల పరంగా ఆమెకు మంజూరు చేసిన సెలవుల కోటా పూర్తైపోయింది.సెంట్రల్ సివిల్ సర్వీసస్(లీవ్స్) రూల్స్ -1972 లోని 43-C ప్రకారం శిశు సంరక్షణ సెలవులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ధరఖాస్తు చేసింది. అయితే దానిని ప్రభుత్వం తిరస్కరించింది.
దీంతో 2018లో ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. శిశు సంరక్షణ సెలవు మంజూరుకు సంబంధించిన రూల్ను ఉపయోగించుకోనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021 ఏప్రిల్ 23న హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై తీర్పును ఇస్తూ పిటిషన్దారైన మహిళకు జన్యుపరమై లోపంతో గల తన కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఆమెకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.
పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - Venkaiah Naidu Padma Vibhushan
ప్రధాని మోదీపై ఈసీకి మళ్లీ కాంగ్రెస్ ఫిర్యాదు- చర్యలు ఉంటాయా? - Lok Sabha Elections 2024