Baba Siddique Death Case : ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధిఖీ హత్యకు మూడు తుపాకులు ఉపయోగించినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు తాజాగా నిందితులు నాలుగు తుపాకులు వినియోగించినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
డ్రోన్ సాయంతో సరిహద్దుల్ని దాటించి నిందితులు వాటిని చేజిక్కించుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మరిన్ని వివరాలను సేకరించేందుకు తుపాకుల ఫొటోలను రాజస్థాన్కు పంపించారు. తూర్పు బాంద్రాలోని తన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిఖీని హత్య చేశారు. అక్టోబరు 12 జరిగిన ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ధర్మరాజ్ కశ్యప్తో శివ్కుమార్ గౌతమ్ అనే ముగ్గురు నిందితులు సిద్ధిఖీని కాల్చి చంపారు. శివ్కుమార్ గౌతమ్కు తుపాకులు వినియోగించడం వచ్చు. అతడు గతంలో ఉత్తర్ప్రదేశ్లో జరిగిన వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరిపిన సందర్భాలున్నాయి. అతడే ఈ కేసులో ప్రధాన షూటర్గా భావిస్తున్నారు. కశ్యప్, సింగ్కు అతడే శిక్షణ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఎన్సీపీ గూటికి జీషన్
మరోవైపు, బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో టికెట్ దక్కకపోవడం వల్ల అతడు అజిత్ పవార్ వర్గంలో చేరినట్లుగా సమాచారం. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్ నుంచి జీషన్ను బరిలో దింపుతున్నట్లుగా పార్టీ వెల్లడించింది. గతంలో జీషన్ కాంగ్రెస్ టికెట్పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు.
"నాకు, నా కుటుంబానికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. మేము కష్టంలో ఉన్నప్పుడు మావెంట ఉండి ధైర్యం చెప్పిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు. బాంద్రా నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నాను. ఇక్కడి ప్రజల ప్రేమ, మద్దతుతో మళ్లీ గెలుస్తానని నమ్ముతున్నాను" పార్టీలో చేరిన అనంతరం జీషన్ మాట్లాడారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అయితే శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.