Odisha High Court Sensational Verdict : ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఎస్కే ఆసిఫ్ అలీకి ఒడిశాలోని జగత్సింగ్పుర్లో ఉన్న పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనికి సంబంధించి జూన్ 27న 106 పేజీల సుదీర్ఘ తీర్పును ఒడిశా హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
"ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ రోజూ దేవుడ్ని ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం" అని తీర్పు ఇచ్చే సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేరంలో పాత్ర ఉన్నట్టుగా తగిన ఆధారాలు లేనందున మరో నిందితుడు ఎస్కే అఖీల్ అలీని నిర్దోషిగా విడుదల చేసింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని కూడా హైకోర్టు సవరించింది. బాధిత బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.