Delhi Bomb Blast : దిల్లీ రోహిణి ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో భారీ పేలుడుపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఉగ్రకోణంలో ఈ కేసును ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి "జస్టిస్ లీగ్ ఇండియా" అనే టెలిగ్రామ్ ఛానల్పై దిల్లీ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఛానెల్ వివరాలు ఇవ్వాలని టెలిగ్రామ్ సంస్థకు దిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఇతర సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను కూడా పోలీసులు కోరారు.
సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద బాంబు పేలుడు ఘటన వివరాలను సీసీటీవీ ఫుజేజీతో సహా "జస్టిస్ లీగ్ ఇండియా" టెలిగ్రాం ఛానల్లో ప్రసారం చేశారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులను మట్టుబెట్టడానికి భారత ఏజెంట్లు చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా ఈ పేలుడు జరిపినట్లు జస్టిస్ లీగ్ ఇండియా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసింది. 'కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా సభ్యుల నోరుమూయించాలని చూస్తే, ప్రపంచంలో వారే మూర్ఖులు. మేము వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్ జిందాబాద్' అనే సందేశాన్ని ‘జస్టిస్ లీగ్ ఇండియా' అని పోస్టులో ఉంది. దీంతో పేలుడు ఘటనలో ఖలిస్థానీ కోణంపై దర్యాప్తు చేయాలని టెలిగ్రామ్కు దిల్లీ పోలీసులు లేఖ రాశారు.
అయితే ఈ విషయంపై టెలిగ్రామ్ సంస్థ ఇంకా స్పందించలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుడుకు సంబంధించి ఏ సంస్థ పేరూ వెలుగులోకి రాలేదన్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.
అనుమానితుడి గుర్తింపు
అధికారులు పాఠశాల సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెల్ల టీషర్ట్ ధరించిన ఓ అనుమానితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. పేలుడు జరగడానికి ముందు రోజు రాత్రి ఆ ప్రదేశంలో అతడు ఏదో చేస్తున్నట్లు ఆ దృశ్యాల్లో ఉన్నట్లు తెలిపారు. పేలుడు పదార్థాలను ఒక పాలిథిన్ బ్యాగ్లో చుట్టి అక్కడ అడుగు గోతిలో అమర్చి, ఆపై చెత్తతో కప్పి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.