Chidambaram Aircel Maxis Case : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎయిర్సెల్ - మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఎయిర్సెల్- మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయిల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనితో చిదంబరంపై విచారణకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనపై విచారణను నిలిపివేయాలని కోర్ట్ ఆదేశించింది.
మనీ లాండరింగ్!
చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్సెల్- మ్యాక్సిస్ ఒప్పందంలో ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. యూపీఏ-1 సర్కార్ అధికారంలో ఉండగా 2006లో, అప్పటికి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ డీల్కు అనుమతులు ఇచ్చారు. రూ.3,500 కోట్ల విలువైన ఈ డీల్లో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ముడుపులు తీసుకున్నారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై 2018 జూలైలో సీబీఐ, ఈడీలు వేర్వేరుగా ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. 2021లో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ట్రయల్ కోర్టు పరిగణనలో తీసుకుంది. చిందబరం, ఆయన కుమారుడు, ఇతర నిందితులకు మనీలాండరింగ్ కింద సమన్లు జారీ చేసేందుకు తగిన ఆధారాలున్నాయని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ దిల్లీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.