Atishi Delhi Chief Minister : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో శనివారం సాయంత్రం ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా ఆతిశీ నిలిచారు.
అయితే ఫిబ్రవరిలో జరిగే దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని సీఎం ఆతిశీ ప్రజలను కోరారు. దిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి మాట్లాడిన ఆమె, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర పన్నినట్లు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ను గెలిపించకుంటే ఇప్పుడు అమలవుతున్న పథకాలను బీజేపీ రద్దు చేస్తుందని ఆతిశీ పేర్కొన్నారు.
#WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9
— ANI (@ANI) September 21, 2024
"దిల్లీ ప్రజలందరం కలిసి ఒక పనిచేయాలి. అరవింద్ కేజ్రీవాల్ను ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో దిల్లీ ముఖ్యమంత్రిని చేయాలి. ఒకవేళ దిల్లీప్రజలు అరవింద్ కేజ్రీవాల్ను దిల్లీ ముఖ్యమంత్రిని చేయకుంటే దిల్లీ ప్రజలకు ఇప్పుడు లభిస్తున్న ఉచిత విద్యుత్ను బీజేపీ రద్దుచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను అరవింద్ కేజ్రీవాల్ బాగుచేశారు. అది వృథా అవుతుంది. మొహల్లా క్లీనిక్లు మూతపడుతాయి. ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిచిపోతాయి. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం బంద్ అవుతుంది"
-- ఆతిశీ, దిల్లీ ముఖ్యమంత్రి
అత్యంత పిన్న వయసులోనే దిల్లీ ముఖ్యమంత్రిగా చేపట్టనున్న మహిళగా కూడా ఆతిశీ నిలిచారు. దిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ను అధికారానికి దూరం చేసి ఆప్ గద్దెనెక్కింది. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు 1998లో సుష్మా స్వరాజ్ కేవలం 52 రోజుల పాటు సేవలందించారు.
షీలాదీక్షిత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు 60 ఏళ్లు. సుష్మాస్వరాజ్ 46 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆతిశీ మాత్రం 43 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ వయసులోనే ఈ పగ్గాలు అందుకున్నారు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్ మినహా ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎంలు లేరు. దీంతో మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎంగా ఆతిశీ వ్యవహరిస్తున్నారు. గతంలో మెహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), మాయావతి (యూపీ), రబ్రీ దేవి (బిహార్), జయలలిత (తమిళనాడు) తదితరులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.
ఆతిశీ మార్లేనా సింగ్ ఫైర్బ్రాండే
పైకి సున్నిత వ్యక్తిగా కనిపించే ఆతిశీ మార్లేనా సింగ్ ఫైర్బ్రాండే. ఈ పేరుకు దిల్లీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆమె దిట్ట. దీంతో మద్యం కుంభకోణంతో దుమ్ము కొట్టుకుపోయిన ఆప్ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యతను పార్టీ అగ్ర నాయకత్వం ఆమె భుజస్కంధాలపై పెట్టింది. ఆప్ నేతల్లో చాలామంది జైలుకు వెళ్లడంతో సౌరభ్ భరద్వాజ్తో కలిసి పార్టీని ఆతిశీ ముందుకు నడిపారు.
హరియాణా నుంచి దిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ ఏకంగా జూన్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆతిశీ 1981 జూన్ 8న జన్మించారు. ఆమె పేరు మధ్యలో మార్లేనా అనే పేరు చేర్చడం వెనుక ఓ ఆసక్తికర అంశం ఉంది. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్త వాహి ప్రొఫెసర్లు. వారు కార్ల్ మార్క్స్, లెనిన్ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి మార్లేనా అనే పేరును చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచీ ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు.