Arvind Kejriwal CBI Case : దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు.
ఇప్పటికే దిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ కేసులో అరెస్టై తిహాడ్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను బుధవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపర్చారు. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి అనుమతించింది. ఈ మేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు.
బెయిల్పై హైకోర్టు స్టే
ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గత గురువారం తీర్పునిచ్చింది. అయితే, ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ అమలును నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని పేర్కొంది.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ
మరోవైపు దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది. దిల్లీ హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కోరగా అందుకు సుప్రీం అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పటిషన్ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి చెప్పారు. జిస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన సెలవుకాల ధర్మాసనం అందుకు అనుమతించింది.
స్పీకర్ పీఠం 'ఓం బిర్లా'దే- వరుసగా రెండోసారి ఎన్నిక - Lok Sabha Speaker 2024
దేశంలోని ఆలయాలన్నీ ఒకే చోట! అయోధ్యలో రూ. 650 కోట్లతో 'మ్యూజియం ఆఫ్ టెంపుల్స్'