24 లక్షల మందికి ఆహారం,2.30 లక్షల కుటుంబాలకు చేయూత,12.41 లక్షల భోజనాల పంపిణీ,10వేల మంది దినసరి కూలీలకు 1,000 చొప్పున సాయం.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ దాతృత్వమిది! ఈ సాయం వెనుక ఓ తల్లి హృదయం ఉంది. సుధామూర్తి దానశీలత కరోనా వేళ మరోసారి రుజువైంది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ లక్ష్యం రూ.100 కోట్ల సాయం. సంకల్పం బలంగా ఉంటే.. లక్ష్యం చిన్నదైపోతుంది. సుధామూర్తి అనుకున్నది దాటేశారు. రూ.100 కోట్లు.. కాస్తా రూ.120 కోట్లు అయింది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ నిర్వహిస్తున్న ఫౌండేషన్కు వంద కోట్లు ఖర్చుచేయడం పెద్ద విషయమేం కాకపోవచ్చు. కానీ, దానిని ఎలా వినియోగిస్తున్నారన్నదే ముఖ్యం. ఈ విషయంలో సుధామూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా చేసిన, చేస్తున్న, చేయదలచిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటున్నారు.
బెంగళూరులో ఆస్పత్రి..
కొవిడ్-19 ఉగ్రరూపు దాల్చే క్రమంలో బెంగళూరులో ఓ ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పారు సుధామూర్తి. అన్నట్టుగానే వంద గదుల క్వారంటైన్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో దీనిని ఇటీవలే ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రులకు పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర సామగ్రిని కూడా అందజేసేలా ప్రణాళికలు రూపొందించారామె. క్వారంటైన్ సెంటర్, ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు ప్రధానమంత్రి సహాయనిధి ‘పీఎం కేర్స్’కు రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారు.