నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో.. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్ఈసీ) హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 16 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో పలు తప్పులున్నాయని, ఒకే ఇంటి నంబరుతో వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారని పేర్కొంటూ వి.భువనేశ్వరి ప్రసాద్తో సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. గత నెల 14 నాటికి ఓటర్లు జాబితా ప్రచురించారని, ఇప్పటికీ అందులో తప్పులున్నాయని కోర్టుకు వివరించారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్ది ఎన్నికలు నిర్వహిస్తే అభ్యంతరం లేదన్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని కోరారు.