పండుగ పూట విషాధం- మండపంలో విద్యుత్షాక్తో ఇంటర్ విద్యార్థి మృతి
Published : Sep 7, 2024, 2:58 PM IST
Student Died in Vinayaka Mandapam : వినాయకచవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. వినాయక మండపం వద్ద విద్యుత్ బల్బులు సరిచేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ మండలం సిర్సపల్లికి చెందిన వంగ యశ్వంత్(16) అనే ఇంటర్ విద్యార్థి, నవయుగ యువజన సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ మండపంలో విద్యుత్ బుగ్గలను సరి చేస్తుండగా కరెంట్షాక్కు గురయ్యాడు. ఒక్కసారిగా కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యశ్వంత్ హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వేడుకల కోసం గ్రామానికి వచ్చాడని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.