హైకోర్టులో మరోసారి ఎమ్మెల్సీ రఘురాజు పిటిషన్ విచారణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 10:28 PM IST
High Court On MLC Raghuraju Petition:తనపై శాసనమండలి అనర్హత వేటు వేయటాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని సింగిల్ జడ్జి చీమలపాటి రవి ఆదేశించారు. మంగళవారం ఈ పిటిషన్పై ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అనినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ప్రస్తుత వ్యాజ్యంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చిందన్నారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం రఘురాజు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.