నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ఆ అంశాలపైనే చర్చించేందుకేనా?
Published : Aug 22, 2024, 7:53 AM IST
CM Revanth Reddy Delhi Tour: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. నామినేట్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిలుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినందున వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించిన తర్వాతే కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని సమాచారం. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది.