Decoration of Balarama With Garments Made in Siddipet : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తయారైన వస్త్రాలతో అయోధ్య బాలరాముడిని మనోహరంగా అలంకరించారు. దిల్లీకి చెందిన ముక్తిర్ ఫ్యాషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు వివిధ ప్రాంతాల వస్త్రాలను సేకరించి అయోధ్య ఆలయానికి అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే నెలన్నర క్రితం ఆ కంపెనీ ప్రతినిధులు సిద్దిపేట జిల్లా దుబ్బాక హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్స్ ప్రొడ్యూసెర్ కంపెనీ లిమిటెడ్ వారిని సంప్రదించారు.
నాలుగు రోజుల పాటు చేనేత కార్మికులు మగ్గంపై 80/100లెనిన్ జరి అంచుతో కూడిన 15 మీటర్ల తెలుపు రంగు వస్త్రాన్ని తయారు చేసి అందించారు. ఆలయ అర్చకులు ఈ వస్త్రాన్ని బాలరాముడికి అలంకరించారు. దుబ్బాకలో తయారైన వస్త్రాన్ని అలంకరించడం గొప్ప అనుభూతి మిగిల్చిందని సీఈవో బోడ శ్రీనివాస్ తెలిపారు.