'ఇది ఘోరం, అరాచకం' - తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలి: మోహన్బాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 10 hours ago
Actor Mohan Babu React on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరుగుతుండటంపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూలో కలిపే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలియగానే భక్తుడిగా తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంత్రికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన లడ్డూ తయారీలో కల్తీ నిజమైతే నేరస్థులను కఠినంగా శిక్షించాలని తన ఆత్మీయ మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతున్నట్లు తెలిపారు. తమ విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటారని, ఆ స్వామి వద్ద ఇలాంటి ఘోరం, అరాచకం జరగడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు చంద్రబాబుకు ఉండాలని కోరుకుంటున్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు.