స్కూల్ బస్సు బోల్తా పడి చెలరేగిన మంటలు- 12మంది విద్యార్థులు సజీవదహనం
Published : Jul 11, 2024, 7:13 AM IST
South Africa School Bus Accident : దక్షిణాఫ్రికాలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి, మంటలు అంటుకోవడం వల్ల 12మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. గౌటెంగ్ ప్రావిన్సులోని మోరాఫంగ్ పట్టణంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. సెలవుల అనంతరం బడులను తెరచిన ఒకరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగడం వల్ల విషాదం నెలకొంది. గాయపడిన ఏడుగురు చిన్నారుల్ని ఆసుపత్రిలో చేర్చారు. బస్సును ఓ చిన్న ట్రక్కు వెనుక నుంచి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విద్య, రవాణా శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, దక్షిణాఫ్రిలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్ గౌటెంగ్. ఇక్కడ పాఠశాలకు వెళ్లేందుకు వేల మంది విద్యార్థులు ప్రైవేటు మినీ బస్సులను ఆశ్రయిస్తారు.