'మంచి వేతనం అని నమ్మి వస్తే - పాస్పోర్టు తీసుకుని గదిలో బంధించారు' - ఇరాక్లో తెలంగాణ యువకుడి నరకయాతన - TELANGANA MAN TRAPPED IN IRAQ
ఉపాధి కోసం ఇరాక్ వెళ్లి మోసపోయిన తెలంగాణ యువకుడు - పాస్పోర్టు తీసుకుని బంధించారంటూ సెల్ఫీ వీడియో - బయటకు వెళ్లలేక పస్తులతో ఇబ్బందులు పడుతున్నానంటూ ఆవేదన
!['మంచి వేతనం అని నమ్మి వస్తే - పాస్పోర్టు తీసుకుని గదిలో బంధించారు' - ఇరాక్లో తెలంగాణ యువకుడి నరకయాతన TELANGANA MAN STUCK IN IRAQ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/1200-675-22632103-thumbnail-16x9-ajay.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 8, 2024, 10:39 AM IST
|Updated : Oct 8, 2024, 11:49 AM IST
Jagtial Man Trapped in Iraq : మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఉంటుందన్న ఏజెంట్ మాటలు నమ్మి విదేశాలకు వస్తే గదిలో బంధించారంటూ సెల్ఫీ వీడియోలో ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్కు చెందిన పల్లపు అజయ్ 14 నెలల క్రితం రూ.2.70 లక్షలు కట్టి ఇరాక్ దేశానికి వెళ్లాడు. అజయ్కు ఉపాధి కల్పించాలంటూ ఏజెంట్ ఇరాక్లో ఇతరులకు అప్పగించాడు. వారు పని కల్పించకుండా అజయ్ పాస్పార్టును తీసుకున్నారు. అక్కడి భాష రాక, బయటకు వెళ్లలేక గదిలోనే ఉంటున్నట్లు అజయ్ తన తల్లిదండ్రులు రాధ, గంగయ్యకు సమాచారమిచ్చారు.
ఐదు నెలల క్రితం ఏజెంట్ ఇండియాకు రాగా అజయ్ తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. దీంతో రూ.లక్ష వెనక్కి ఇచ్చాడు. వారు ఆ డబ్బును అజయ్కు పంపించారు. ఇండియాకు వచ్చేందుకు పాస్పోర్టు లేదని తల్లిదండ్రులకు తెలపడంతో నెల కిందట మరోసారి రూ.66 వేలు పంపించారు. రోజూ పస్తులతో ఇబ్బందులు పడుతున్నానంటూ అజయ్ సెల్ఫీ వీడియో పంపించడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. తమ కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
యజమాని చెర నుంచి బయటపడ్డ గల్ఫ్ బాధితుడు : బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ పడరాని పాట్లు పడ్డాడు. ఏజెంట్ చేతిలో మోసపోయాయని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా గత నెలలో సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ సాయం చేసి తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. తాజాగా ప్రభుత్వం చొరవతో సౌదీ అరేబియా ఎడారిలో యజమాని చెర నుంచి నిర్మల్ జిల్లా వాసికి విముక్తి కలిగింది.
నిర్మల్ జిల్లా ముధోల్ మండల రువ్వి గ్రామానికి చెందిన రాఠోడ్ నాందేవ్ అనే వ్యక్తి హౌస్ కీపింగ్ ఉద్యోగం పేరుతో సౌదీ వెళ్లాడు. ఎడారిలో ఏజెంట్ వదిలేశారంటూ తనను రక్షించి హైదరాబాద్కు తీసుకెళ్లాలని సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్న నేపథ్యంలో గల్ఫ్ బాధితుల సంఘం నేతలు సర్కారు చొరవతో ఈ నెల 1న శంషాబాద్ తీసుకువచ్చారు. గల్ఫ్లో మానవ అక్రమ రవాణా మాఫియాగా మారిందంటూ గల్ఫ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఆరోపించారు.
'సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న - దయచేసి నన్ను కాపాడండి సార్' - Man Facing Problems In Saudi
'ఉద్యోగమంటూ నన్ను దుబాయ్ ఎడారిలో వదిలేశారు' - 'గోట్ లైఫ్' మూవీని తలపించే ఘటన - DUBAI JOB FRAUD NEWS