By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 11:08 AM IST
వైసీపీ మద్దతు దార్లకే డబ్బులిస్తారా! ప్రశ్నించిన వారిపై దాడి- దేహశుద్ధి చేసిన మహిళలు - YSRCP SARPANCH MONEY DISTRIBUTION
YSRCP SARPANCH MONEY DISTRIBUTION: వైఎస్సార్సీపీ సర్పంచికి మహిళలు దేహశుద్ధి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎమనాసనపల్లిలో గ్రామ సర్పంచ్ సురేష్ ఓటర్లకు నగదు పంచేందుకు వచ్చారు. అయితే ఈ క్రమంలో కేవలం అధికార పార్టీ మద్దతుదారులకు మాత్రమే నగదు పంచుతుండడంతో స్థానికులు అడ్డుకుని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ సురేష్ ఆగ్రహంతో ఊగిపోతూ మహిళలపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు సర్పంచ్కు దేహశుద్ధి చేశారు. భయపడిన సురేష్ ఓ ఇంట్లో దాక్కున్నాడు. బయటకు వచ్చేవరకు అక్కడే ఉంటామని మహిళలు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్సీపీ నేతలు పోలీసులను వెంబబెట్టుకుని వచ్చారు.
మహిళలు నిలువరించి ఇంట్లో దాక్కున్న సర్పంచ్ సురేష్ను పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీస్ వాహనాన్ని మహిళలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. అతన్ని అప్పగించాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు గ్రామస్థుల కళ్లుగప్పి వైఎస్సార్సీపీ నాయకుడి వాహనంలో సర్పంచ్ను అక్కడి నుంచి బయటకు తరలించారు. గ్రామస్థులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు సర్పంచ్ని అదుపులోకి తీసుకోవడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.