By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 1:11 PM IST
'ఎలా కూలుస్తారో చూస్తా' - మున్సిపల్ అధికారులతో వైఎస్సార్సీపీ నేత అన్నా రాంబాబు వాగ్వాదం - YCP Leader Argument with Officials
YSRCP Leader Anna Rambabu Argument with Municipal Officials: వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా భవనాలు కట్టడమే కాకుండా వాటిపై చర్యలు తీసుకోవడానికి వెళ్లిన అధికారులతో సైతం దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మున్సిపల్ కమిషనర్తో వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అక్రమంగా నిర్మించిన భవనాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆ పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు.
పట్టణంలో పలు అక్రమ భవనాలను తొలగించాలని ఇదివరకే పలువురు భవన యజమానులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వారు స్పందించక పోవడంతో అక్రమ కట్టడాలను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. కూల్చివేతకు భవనం దగ్గరికి వెళ్లిన అధికారులతో ఎలా కూలుస్తారో చూస్తామంటూ వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే అక్రమ కట్టడాలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కిరణ్ తెలిపారు.