'శ్రీవారి చక్రస్నానానికి సర్వం సిద్ధం - సామాన్య భక్తులకు మరిన్ని సౌకర్యాలు'
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Chakra Snanam Arrangements in Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే చక్రస్నానానికి సర్వం సిద్ధమైంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు తడి బట్టలు మార్చుకునేందుకు మొదటిసారిగా షెడ్లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మరిన్ని సౌకర్యాలు కల్పించారు. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోల్డింగ్ పాయింట్లను అమలు చేస్తున్నాం. పుష్కరిణిలో సామర్థ్యానికి తగ్గట్లు భక్తులను పంపించి మిగత వారిని నిలిపివేస్తున్నాం. మొదట వెళ్లిన వారు బయటకు వచ్చాక మిగతా వారిని పుష్కరిణిలోకి పంపిచేందుకు ప్రణాళిక వేసుకున్నాం.
ఇప్పటికే దీనికి సంబంధించిన సూచనలను సంబంధిత అధికారులకు వివరించాం. నిరంతరం టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. చక్రస్నానాలు పూర్తయిన తరువాత భక్తులు మాఢ వీధుల్లో నడిచేటప్పుడు జారి పడకుండా తడిని శుభ్రం చేసేందుకు సైతం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ ఉంటుంది కనుక ఆ సమయంలోనే వేడిగా ఉండే బాదం మిల్క్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. వీఐపీలు వచ్చినప్పుడు ఉత్తరం దిక్కున ఉన్న పుష్కర ఘాట్లోకి అనుమతిస్తాం అని వెంకయ్య చౌదరి తెలిపారు.