By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 4:00 PM IST
ప్రతిపక్షంలో ఉన్నా హిందూపురం అభివృద్ధి ఆగలేదు : బాలకృష్ణ
TDP MLA Nandamuri Balakrishna at Hindupur : రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో మీకు మంచి చేసే, జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో రెండో రోజు పర్యటించిన బాలకృష్ణ పట్టణంలోని శ్రీకంఠపురంలో వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా హిందూపురంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుతున్నారని తెలిపారు. వడ్డెర కులస్తులకు 30 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందన్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని వివరించారు. బాలకృష్ణ హిందూపురం పర్యటన సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తలివచ్చారు. తమ నాయకుడికి భారీ గజమాల వేసి సత్కరించారు.