సింహాసనం గ్రామ సింహాసనంగా మారింది అంబటి - ఆ శునకాన్ని తరిమేస్తాం కాస్కో: టీడీపీ నేతలు - TDP Counter to Ambati Rambabu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 1:27 PM IST
TDP Leaders Counter to Minister Ambati Rambabu : ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సినిమాలకు మించిన డైలాగ్ వార్ రాజకీయ నేతల్లో రంజుగా నడుస్తోంది. న్యూటన్ థర్డ్ లాను మించిన ఫార్ములాతో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబుకు ఏకధాటిగా టీడీపీ నేతలు ఇచ్చి పడేశారు.
సింహాసనం గ్రామ సింహాసనంగా మారింది అంబటి : 'ఇక్కడ ఉన్నది సింహాసనం, కుర్చీ కాదు మడతపెట్టడానికి’ అని అంబటి రాంబాబు ట్విటర్లో (X)లో చేసిన పోస్టును తెలుగుదేశం పార్టీ నేతలు తిప్పికొట్టారు. 'గతంలో అది సింహాసనమే అని, ప్రస్తుతం అది గ్రామ సింహాసనంగా మారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. దానికి ఆ పేరు తెచ్చిన ఘనత ఎవరిదో అంబటి రాంబాబుకి తెలుసని ఎద్దేవా చేశారు.
శునకాన్ని తరిమేస్తాం రాంబాబు : తాము కూడా అదే చెబుతున్నామని కుర్చీ అయితే మడత పెడతామని, సింహాసనం అయితే దాని మీద ఉన్న శునకాన్ని తరిమేస్తామంటూ మరో టీడీపీ నేత బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. గ్రామ వాలంటీర్లకు వందనం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు 'మీరు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీలు మడతపెడతాం' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బదులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.