పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు- కప్పిపుచ్చేందుకు యత్నించిన యాజమాన్యం - Roof of school collapsed in Kadapa
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 6:42 PM IST
Six Students Seriously Injured when the Roof of School collapsed in Kadapa : పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ ఘటన కడపలో చోటుచేసుకుంది. పట్టణంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సాయిబాబా హైస్కూల్ అనే పేరుతో ఓ ప్రైవేటు పాఠశాలను నడుపుతున్నారు. అయితే ఆ పాఠశాల పాతది కావడంతో శిథిలావస్థకు చేరింది. అయినప్పటికి అందులోనే విద్యార్థులకు విద్యాభోధన చేస్తున్నారు. ఎప్పటిలాగే తరగతులను యథావిధిగా నడుపుతుండగా ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడి పిల్లల మీద పడ్డాయి. దీంతో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న తిరుమల ప్రైవేటు ఆసుపత్రికి తరిలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే పాఠశాల యాజమాన్యం విద్యార్థులను దొడ్డిదారిన వేరే ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు నోరు మెదపటం లేదు. ఈ సంఘటనపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు కూడా సమాచారం అందించకపోవడం విశేషం. ప్రమాదాన్ని గుట్టుగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. బాధిత విద్యార్థులంతా సాయిబాబా పాఠశాలలోని హాస్టల్లో ఉంటున్నారు.