వివాదాస్పదంగా మారిన ఎంపీటీసీ మృతి - హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని బంధువుల ఆందోళన - Controversial of MPTC death - CONTROVERSIAL OF MPTC DEATH
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2024, 10:36 AM IST
Relatives Concern due to MPTC Unexpected Death in Eluru District : ఏలూరు జిల్లాలో ఎంపీటీసీ మరణం తీవ్ర వివాదాస్పదంగా మారింది. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు న్యాయం కాావాలని రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేశారు. బాధితులకు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్ధతు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా కామవరుపుకోట మండలం వీరశెట్టి గుడెంకు చెందిన దర్శనపు పాపమ్మ(45) ఎంపీటీసీగా ఉన్నారు. అయితే భర్త మృతి చెందడంతో ఆమె తడికపూడిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 13న ఓటు వేసేందుకు వీరిశెట్టి గూడెంకు పాపమ్మ వచ్చింది.
ఓటు వేశాక తిరిగి అదే గ్రామానికి చెందిన దొడ్డిగర్ల చిట్టిబాబు బైక్మీద ఏలూరుకి బయలుదేరింది. అయితే దెందులూరు మండలం గాలాయిగూడెం వచ్చేసరికి అనుకోకుండా బైక్మీద నుంచి పాపమ్మ కింద పడిపోయింది. దీంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న పాపమ్మను చిట్టిబాబు తడికపూడిలో ఆమె ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పాపమ్మను హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పాపమ్మ శనివారం సాయంత్రం మృతి చెందారు. దీంతో కావలనే హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం కాావాలని రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిపై సమీక్షించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.