పింఛన్ పంపిణీ ప్రక్రియ రేషన్ డీలర్లకు ఇవ్వాలి: మాధవరావు - Ration Dealers Association - RATION DEALERS ASSOCIATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 8:07 PM IST
Ration Dealers Association State President on Pensions: పెన్షన్ పంపిణీ ప్రక్రియను రేషన్ డీలర్లకు అప్పగించాలని రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీలర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ సులభతరం అవుతుందన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆశయం పూర్తిగా నెరవేరడం లేదన్నారు. లబ్ధిదారులు వాహనాల వద్దకే వెళ్లి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కారణంగా గ్రామాల్లో కొంత మంది లబ్ధిదారులు ఆ రోజు ఉపాధి వేతనం కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తమకు ఆదాయం సైతం భారీగా తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చిన పార్టీలకే తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రామారావు, రాష్ట్ర కార్యదర్శి ఎం భుజంగరావు పాల్గొన్నారు.