చెరువులో రసాయనాలు డంపింగ్ - ఆందోళనలో స్థానికులు - Pharma Waste Chemicals - PHARMA WASTE CHEMICALS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 12:46 PM IST
Pharma Waste Chemical Drums Dumping in Pond in Anakapalli District : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేశారు. రసాయనాల దుర్గంధంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని డ్రమ్ముల మీద పరవాడ, అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకు చెందిన లేబుల్స్ ఉన్నాయని స్థానికులు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ చూసుకోవాల్సిన రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫార్మా వ్యర్థ పదార్థాలు చెరువుల్లో డంపింగ్ చేయడం వల్ల భూ గర్భ జలాలు, నేల కాలుష్యానికి గురవుతోందని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి కారణం రాంకీ ఫార్మా యాజమాన్య నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యాజమాన్యం చెక్పోస్ట్ నిర్వహణ సరిగా చేయకపోవడం వల్లనే రసాయన వ్యర్థాలు ఎక్కడికక్కడ డంపింగ్ జరుగుతుందని మండిపడ్డారు. రాంకీ ఫార్మా యాజమాన్యం నిర్లక్ష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.