అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు - ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం : మంత్రి పొంగులేటి - Ponguleti On Corrupt Officials
Published : Aug 18, 2024, 4:37 PM IST
|Updated : Aug 18, 2024, 5:23 PM IST
Minister Ponguleti Fires On Corrupt Officials : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అయినా, రెవెన్యూ శాఖలో అయినా అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే, దానిని దుర్వినియోగం చేస్తే, చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో నిబంధనలకు లోబడే ఉంటుందని, సర్కార్ ఆస్తులకు నష్టం కలిగించే రీతిలో చర్యలు ఉండవని వెల్లడించారు. నిర్దేశించిన మూడు నెలల్లో వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్టాంపులు, రిజస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ విలువల పెంపు పూర్తి శాస్త్రీయ పద్దతిలో ఉంటుందని, బిల్డర్ల వినతిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తరువాత బిల్డర్ల ప్రతిపాదనపై ముందుకు వెళ్తామని వివరించారు.