నాలుగేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురుచూపులు - ఇక ఆత్మహత్యే శరణ్యం - Distress for CM Relief Fund
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 10:02 PM IST
Man Petition to Collector for CM Relief Fund: నాలుగేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ ఓ బాధితుడు కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి స్పందన కార్యక్రమానికి తన భార్యతో కలిసి వచ్చి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గుత్తి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణకు 2020లో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడంతో రూ. లక్షా 40 వేల ఖర్చుతో వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తిరుగుతున్నామని కానీ ఎవరిని కలిసినా పట్టించుకోవడం లేదని అన్నారు.
నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి దగ్గరికి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. నలుగురు పిల్లలతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులకు అప్పులు చేశానని, బాకీ తీర్చమని వారు చేస్తున్న వేధింపులు భరించలేకపోతున్నామని ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండుసార్లు సీఎం జగన్కు విన్నవించినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా సీఎం రిలీఫ్ ఫండ్ తనకు వచ్చేలా అధికారులు చొరవ చూపాలని కోరారు.