సీఎం ఇలాకాలో గుట్టలను గుంతలు చేస్తున్నారు- చోద్యం చూస్తున్న అధికారులు - కొండ గుట్టలను తవ్వేస్తున్ననేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 6:20 PM IST
Illegal Mining of Hills in YSR District : సీఎం జగన్ సొంత జిల్లాలో కొంతమంది స్వార్థపరులు కొండ గుట్టలను అక్రమంగా తవ్వేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద యంత్రాలతో నిరంతరం రాళ్లు, మట్టిని తవ్వి రవాణా చేస్తూ ప్రకృతికి ఆటంకం కలిగిస్తున్నారు. బద్వేల్ పట్టణంలో స్థలాలకు గిరాకీలు పెరిగిపోవడంతో మట్టి, రాళ్ల మాఫియా ట్రాక్టర్లు, లారీలతో నిరంతరం రవాణా చేస్తున్నారు. ఇంటి పునాదులను పూడ్చేందుకు మట్టి, రాళ్లను వినియోగిస్తూ ట్రాక్టర్ మట్టి లోడు రూ.1100, లారీ మట్టి లోడు రూ.4000 వరకు విక్రయిస్తున్నారని స్థానికులు తెలిపారు.
జిల్లాలో అక్రమ మాఫియాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. మేకలు, గేదెలు మేత కోసం కొండ గుట్టలపై ఆధారపడ్డామని కాపరులు వాపోయారు. పూర్తిగా కనుమరుగైపోతే జీవాల పరిస్థితి ఏంటని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు రాళ్లును, మట్టిని తవ్వి రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.