ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఆ జీవిత ఖైదీలంతా నిర్దోషులు'- కప్పట్రాళ్ల హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు - HC on Kappatralla Faction Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 11:30 AM IST

HC on Kappatralla Village Faction Conflict Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ఫ్యాక్షన్ గొడవల్లో 11 మంది మృతికి కారణమంటూ జీవిత ఖైదు పడిన దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆదోని కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. సురేశ్‌రెడ్డి, జస్టిస్ బీవీఎల్​ఎన్​ చక్రవర్తితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన పాలెగారి వెంకటప్పనాయుడు, మాదాపురం మద్దిలేటినాయుడు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. 

2008 మే 17న వెంకటప్పనాయుడు, మరో 10 మందిని వాహనాలతో ఢీ కొట్టి, బాంబులు విసిరి వేటకొడవళ్లతో అత్యంత దారుణంగా హత్య చేశారనే ఆరోపణలతో మద్దిలేటినాయుడు మరికొందరిపై దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా నేరం కింద నేర నిరూపణ కావడంతో కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు 17 మందికి జీవిత కారాగార కఠిన శిక్ష విధిస్తూ 2014 డిసెంబర్ 10న తీర్పు ఇచ్చింది. వివిధ సెక్షన్ల కింద మరికొందరిని దోషులుగా ప్రకటించింది. ఆదోని కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం అప్పీలుదారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details