JEE MAIN 2025 TOPPER SAI MANOGNA: జేఈఈ మెయిన్ ఫలితాలలో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. 14 మందికి మాత్రమే 100 పర్సంటైల్ రాగా, వారిలో సాయి మనోజ్ఞ మాత్రమే ఏకైక బాలిక. గుంటూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో చదువుతున్న మనోజ్ఞ అధ్యాపకులు ఇచ్చిన ప్రణాళికను అనుసరించడం వల్లే ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. ఇంత గొప్ప విజయం తనకు ఎలా సాధ్యమైంది? ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇంజినీరింగ్లో ఏ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో సాయి మనోజ్ఞ మాటల్లో తెలుసుకుందాం.
ఈ విజయం ఎలా సాధ్యమైందంటే?: "నేను గుంటూరులోనే ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా లెక్చరర్లు చెప్పిందే ఫాలో అయ్యాను. ఇక్కడ మంచి కరికులమ్, అధ్యాపకుల సపోర్టు బాగుండేది. రోజూ ఇష్టంతో కష్టపడి చదవడం వల్ల ఈ విజయం సాధ్యమైంది".
ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే?: "మాకు రోజూ కాలేజీలో టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారమే చదివాను. వారంలో కొన్ని పర్టిక్యులర్ టాపిక్స్ ఉండేవి. వాటి ప్రకారమే చదివాను. లెక్చరర్లు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేసేదాన్ని. వాటిపై లెక్చరర్లు సలహాలు ఇచ్చేవారు. ప్లాన్ ప్రకారం చదువుకున్నా".
మీకు పరీక్ష పేపర్ ఎలా అనిపించింది?: "నేను జనవరి 23వ తేదీన పరీక్ష రాశాను. నా షిఫ్టు పేపర్ ఈజీగానే ఉందనిపించింది. మాకు కాలేజీలో గ్రాండ్ టెస్ట్లు పెడతారు. అందులో వచ్చే డిఫికల్టీ లెవెల్ కన్నా మెయిన్స్లో కష్టం తక్కువగానే ఉందనిపించింది. దీంతో కాన్ఫిడెన్స్తో వచ్చింది. సమయం సరిపోయింది. గంటలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోయింది. 1.20 గంటలు మ్యాథ్స్కు ఇచ్చాను. చివరి 40 నిమిషాలు ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాను".
ఇంజినీరింగ్ ఎక్కడ, ఏ కోర్సులో చేరాలనుకొంటున్నారు?: "ఎక్కడైనా మంచి ఐఐటీలో చేరాలని అనుకొంటున్నాను. ఈసీఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆ సబ్జెక్టుపైనే ఇంట్రస్ట్ ఉంది. కష్టపడి మంచి స్థాయికి వెళ్లాలనేది నా టార్గెట్. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఏదైనా మంచి ఐఐటీలో జాయిన్ అవుతాను".
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు - ఏపీ బాలికకు వంద పర్సంటైల్