తెలంగాణ

telangana

వరద సాయం నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ : ఖమ్మం జిల్లా కలెక్టర్​ - Khammam Collector On Floods

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 5:58 PM IST

Khammam District Collector (ETV Bharat)

Khammam Collector On Floods Aid : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఖమ్మం జిల్లాలో నిలువనీడ లేక ప్రభుత్వ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ప్రకటించిన రూ.16 వేల 500లను మంగళవారం నుంచి బాధితుల ఖాతాల్లో చేరుతున్నాయని ఖమ్మం జిల్లా కలెక్టర్​ తెలిపారు. పరిహారాన్ని మొత్తం నేరుగా సీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం రూ. 25కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 7కోట్లను బాధిత కుటుంబాల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.  

జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు వచ్చాయని అన్నారు. రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తారని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పరిహారం అందించేందుకు గానూ మొత్తం 15,096 కుటుంబాలను అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 25 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. బాధిత కుటుంబాలందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తామని, మొత్తం ఈ ప్రక్రియ మూడ్రోజుల్లో బాధితులందరి ఖాతాల్లో వరద సాయం చేరేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details